చక్రార్చన
పరమేశ్వరి యొక్క యంత్రరూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం తొమ్మిది ఆవరణలుంటాయి. ఆ ఆవరణలలో వివిధ దేవతలు ఉంటారు. వీరందరినీ తొమ్మిది ఆవరణలలోనూ విడివిడిగా అర్చించటాన్నే శ్రీచక్రపూజ, నవావరణార్చన లేదా చక్రార్చన
అంటారు. శ్రీచక్రం మూడు ప్రస్తారాలుగా ఉంటుంది. అవి
1. భూప్రసారము
2. మేరు ప్రసారము
3. కైలాస ప్రసారము
అలాగే శ్రీచక్రపూజ కూడా మూడురకాలు అవి.
1. సృష్టి పూజ 2. స్థితిపూజ 3. సంహారపూజ. వీటిలో
మేరు చక్రం మీద - సృష్టి క్రమంలోను
కైలాసము, అర్ధమేరువుల మీద - సంహారక్రమము
భూప్రస్థారం మీద - స్థితిక్రమము
లో ఈ అర్చన చెయ్యాలి. అయితే ఈ అర్చనావిధానంలో
1. సృష్టి క్రమము బిందువు దగ్గర మొదలు పెట్టి భూపురం దాకా అన్ని ఆవరణలను అర్చించటం.
2. సంహారక్రమము భూపురం దగ్గర మొదలు పెట్టి బిందువుదాకా ఆవరణ దేవతలను అర్చించటం.
3. స్థితి క్రమము అంతర్దశారం దగ్గర మొదలు పెట్టి భూపురం దాకా, ఆ తరువాత అష్టకోణం దగ్గర నుండి బిందువు దాకా ఆవరణ దేవతలను అర్చించాలి.
చక్రార్చన ఎప్పుడూ సంహారాంతంగానే ఉండాలి. ప్రతి ఆవరణలోను ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. చక్రార్చనలో పాత్రాసాధన అనేది సంప్రదాయాన్ని బట్టి
వేరువేరుగా ఉంటుంది. కాబట్టి దాన్ని గురు సంప్రదాయం ప్రకారమే చెయ్యాలి.
శ్రీ చక్రాధి దేవత అయిన పరమేశ్వరి సృష్టికి ముందునుంచీ ఉన్నది. మేరుపర్వత శిఖరాన త్రిపురముల యందు ఉంటుంది. ఆమె పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి జ్ఞానమయి. జ్ఞానముచేతనే ఆమెను తెలుసుకోవాలి. గుణాతీతురాలు. మహాత్రికోణమందుంటుంది.
ఆమె నిష్కళంక. ఆమె చరిత్ర మహాద్భుతము. తన భక్తుల కోరికలను తీరుస్తుంది. ఆమెను పునశ్చరణ ద్వారానే పొందాలి. ఆమె తత్త్వాతీత. షడధ్వాతీత.
కరుణాసముద్రురాలు. పాపాత్ములు పుణ్యాత్ములు అనే భేదం లేకుండా అందరి మీదా ఒకే రకమైన కరుణ
చూపుతుంది. భక్తుల యొక్క అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానజ్యోతులు వెలిగిస్తుంది. ఆ బాలగోపాలము ఆమెను ఎరుగుదురు. ఆ పరమేశ్వరి శాసనాలు మీరటానికి లేదు. ఇటువంటి పరమేశ్వరి ఎక్కడ ఉంటుంది. అంటే శ్రీచక్రరాజమందు ఉంటుంది.
ఆమె త్రిపురసుందరి. శివునితో తాదాత్మ్యం చెందిన లలితాంబిక. పరమేశ్వరి శ్రీచక్రంలో ఉంటుంది. కాబట్టి శ్రీవిద్యలో చక్రార్చన చాలా ముఖ్యమైనది.
ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం
తనను అర్చించే భక్తుల కోరిక ఇహముగాని పరముగాని తప్పక తీరుస్తుంది.
974. బిందుతర్పణసంతుష్టా
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
శ్రీచక్రంలో తొమ్మిదవ ఆవరణ సర్వానందమయ చక్రము. అక్కడ ఉండేది బిందువు. అదే నిరాకారుడు నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ. నాలుగు వర్ణములవారు తర్పణ చెయ్యటంచేత తృప్తి చెందుతుంది కాబట్టి బిందుతర్పణసంతుష్టా అనబడుతుంది.
బ్రాహ్మణులు - క్షీరముతోనూ
క్షత్రియులు - ఆజ్యముతోనూ
వైశ్యులు - తేనెతోనూ
శూద్రులు - నీటితోనూ
బిందువునందు పరమేశ్వరికి తర్పణ చెయ్యాలి అని తంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీచక్రంలో బిందువు ముఖ్యమైనది. అది శివశక్తుల సంగమస్థానం. కాబట్టి అర్చనా కాలంలో పరమేశ్వరికి బిందువునందే తర్పణ చెయ్యాలి. ఆ తర్పణ దేవిని సంతృప్తి పరుస్తుంది. అందుచేతనే దేవి బిందుతర్పణసంతుష్టా అనబడుతుంది
974. 🔱🙏 బిందుతర్పణ సంతుష్టా 🙏🔱
ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *బిందుతర్పణ సంతుష్టాయై నమః* అని చెప్పాలి
బిందు = శ్రీచక్రము నందలి బిందువు నందు,
తర్పణ = తర్పణము చేయుటచే,
సంతుష్టా = తృప్తి నొందునది.
శ్రీ చక్రంలోని నవావరణమే బిందువు. ఈ బిందువు శ్రీ చక్రానికి కేంద్రము. ఒక విధముగా చెప్పుకోవాలంటే ఇరుసు(Axis) లాంటిది. చక్రభ్రమణంలో ఉన్న దేనికైనా ఒక అక్షం ఉంటుంది. భ్రమణం చేసే వస్తువులో ఏ భాగమైతే కదలకుండా మిగతా భాగమంతా తిరగడానికి ఆధారం అవుతుందో - దాన్ని 'అక్షము' అంటారు. అంటే కదిలే దాంట్లో కదలకుండా ఉండేదే ' అక్షం' అన్నమాట ! కాలచక్రంలో విశ్వభ్రమణ కారకమైన అమ్మవారు కూడా తను మాత్రం నిలకడగా మార్పు లేకుండా ప్రశాంతంగా ఉంటూ - అన్నిటినీ చరింపచేస్తుంది. శ్రీ చక్రంలోని బిందుస్థానమే అయ్యవారితో కలసి ఉండే అమ్మవారి నిలకడ స్థానాన్ని సూచిస్తుంది. ఈ బిందు స్థానం వద్ద తర్పణాలు, హవిస్సులు సమర్పిస్తే ఉత్సవ విగ్రహం దగ్గర కాకుండా ప్రశాంతంగా, స్థిరంగా, మార్పులే కుండా ఉండే మూలవిరాట్ విగ్రహం దగ్గర సమర్పించిన విధంగా ఉంటుందనే భావన కలగాలి. అందుకే బిందువు వద్ద అర్పణ చేసిన తర్పణాలంటే అమ్మవారు సంతుష్టి చెందేది.
మనలో బ్రహ్మరంధ్ర స్థానం వద్ద ఉండే సహస్రారంలోని చంద్రమండలం వద్ద ఉన్న స్థానాన్నే 'బిందువు' అంటారు. మనకు మెలకువ వచ్చినపుడు ఎక్కడ దానికి ప్రారంభమో - దాన్ని 'బిందువు' అంటారు. మెలకువ రావడం అంటే 'నేను' అన్న పదానికి అర్థం తెలియడమే ! ఏదైనా విషయం అర్ధమవడమంటే - చిచ్ఛక్తి పనిచెయ్యడం ప్రారంభమవడమే ! చిచ్చక్తి కి పాదుకలుగా 'విమర్శ' 'ప్రకాశ' బిందువులను సమన్వయపరచుకోవచ్చును. కాబట్టి - ఈ బిందువుల వద్ద తర్పణాలు, హవిస్సులు సమర్పిస్తే చిచ్చక్తికి పాద పూజ జరిగినట్లే! పాదుకాంత దీక్ష ఫలించినట్లే ! అయితే ఇలా చేయగలగడం, ఈ స్థితికి రావడం కుండలినీయోగంలో ఎంతో సాధన ఉన్నవారికే సిద్ధిస్తుంది. అందుచేతనే ప్రస్తుత నామం - స్తోత్రంలో చివరకు చెప్పబడుతుంది. సాకారమైన జగత్తుకు సంకల్పమే ఈ బిందువు అని కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాదు - మనలో ఏదైనా అందాము అనిపించే నాదమూలస్థితి - ఈ బిందువే! మన వాక్కు మనలో ఇమిడి ఉన్న చోటు - ఈ బిందువే ! తైత్తి రీయంలో చెప్పబడిన * సేంద్రయోనిః'*అనే మంత్రంలోని 'యోని' - ఈ బిందువే !
సౌందర్యలహరిలో ఆదిశంకరులు వ్రాసిన 'సుధాసింధోర్మధ్యే... శ్లోకంలోని సుధాసింధువు - ఈ బిందువే!
బ్రహ్మాండ పిండాండాలకు శ్రుతి (Tuning) కుదరాల్సింది ఈ బిందువు వద్దనే | మనస్సు ఆత్మలో లీనమయే చోటు ఈ బిందువే ! దీన్నే జ్యోతిశ్శాస్త్రంలో రవి, చంద్రుల సమాగమస్థితిగా చెబుతారు. (జీవుల యందు సూర్యకళ వర్తించదు. చంద్రకళే వర్తిస్తుంది. అందుకనే మనకు కళలు (Moods) ఎక్కువ.
రవిచంద్రుల సమాగమస్థితి అనే అమావాస్య నుండి పాడ్యమిని కనుగొనటమే బిందువికసన ప్రారంభం. ఎందుకంటే - అమావాస్య అనేది మనకు - దేవతలకు మధ్య వర్తించే ద్వారం లాంటిది కాబట్టి. తెలుసుకునేవాడు తెలియ వలసిన దాంట్లోకి లీనమయేది ఈ బిందువు వద్దనే !
1) శ్రీ చక్రంలోని బిందువు నందు తర్పణ చేయుటచే సంతుష్టి నొందునది.
2) సహస్రారంలోని చంద్రమండల స్థానం వద్ద తర్పణ చేయుటచే సంతుష్టి నొందునది.
3) సాకారమైన జగత్తుకు సంకల్ప బిందువు వద్ద జరుగు తర్పణ, హవిస్సులకు సంతుష్టి చెందునది - అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును.
975. 🔱🙏 పూర్వజా 🙏🔱
మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *పూర్వజాయై నమః* అని చెప్పాలి.
పూర్వజా = అన్నిటి కన్నా ముందు ఉండునది.
ఇంతకు ముందు నామంలో బిందువు గురించి చెప్పబడింది. ఆ బిందువు కంటె ముందు ఉండేది అమ్మవారు - అని ఈ ప్రస్తుత నామం సూచిస్తుంది. పెట్టబోయే 'చుక్కలాగ, కాబోయే 'వాక్యం' లాగా ఉండే అమ్మవారి నామాన్ని పూర్వజా' అంటారు. తైత్తిరీయంలో కూడా “అహమస్మి ప్రథమజాఋతాస్య, పూర్వం దేవేభ్యో అమృతస్య నా
భాయి, యో మాదదాతి స ఇదేవమావా:” అని చెప్పబడింది.
“ అడిగినప్పుడల్లా అమ్మవారు ఉందన్నారు - బాగానే ఉంది. అడిగేవారు లేక ముందు కూడా ఉందా ?” అని ఎవరైనా ప్రశ్నవేస్తే - 'ఉంది' అనేదే సమాధానం. అయితే - ఎలా ఉంది? అని మళ్ళీ ప్రశ్నిస్తే ఎవరికి' ? అని అనాల్సి వస్తుంది. అప్పుడు ప్రశ్నవేసిన వాడు అయోమయంలో పడాల్సి వస్తుంది. కాబట్టి 'పూర్వజా' అని పిలువబడే సృష్టికర్తి అయిన అమ్మవారి విషయంలో అలా ప్రశ్నించడం అర్థం లేదని తెలుసుకోవాలి.
శ్రీ మద్భాగవతంలో శ్రీకృష్ణుని కన్నా ముందు పుట్టినట్లుగా చెప్పబడిన 'యోగమాయ' - ఈ 'పూర్వజా' నామాన్ని సూచిస్తుందని కూడా చెప్పుకోవచ్చును.
నిద్రపోత్నునపుడు, మెలకువరాక పూర్వం కూడా మనలో ఉన్న అమ్మవారి నామం 'పూర్వజా' అని చెప్పుకోవచ్చును.
విష్ణు పురాణంలో - మహా విష్ణువు, శివ పురాణంలో - సదాశివుడు, దేవీ భాగవతంలో - అమ్మవారు, వేదాంతంలో పరబ్రహ్మ - వీళ్ళు ఉండటమే గాని పుట్టడం' ఉండదు. వీళ్ళే ' పూర్వజులు' అన్న మాటకు అర్హులు. వీళ్ళ కంటే ముందు పుట్టిన వారుండరు. ఉన్న వారే ఉంటారు.
1) బిందువు కన్న ముందు ఉన్నది.
2) కాబోయే వ్యక్తమును సూచించు అమ్మవారి నామము.
3) భాగవతంలో శ్రీ కృష్ణుని ముందుగా పుట్టినట్లు చెప్పబడిన యోగమాయ.
4) నిద్ర పోతున్నపుడు, మెలకువరాక పూర్వము గూడా మనలో ఉండునది -- అని ఈ నామానికి అర్ధాలు చెప్పవచ్చును.
976. 🔱🙏 త్రిపురాంబికా 🙏🔱
ఐదక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *త్రిపురాంబికాయై నమః* అని చెప్పాలి.
త్రివుర = త్రిపురములచే సూచింపబడు వానికి,
అంబికా = మూలమైన తల్లివంటిది.
త్రిపురాలుగా సూచింపబడేవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను త్రిపురాలంటారు. చిత్ బిందువు, ప్రకాశ బిందువు, విమర్శ బిందువులుగా వికసనం చెందే మూడింటికి - ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులుగా ప్రతిపాదింపబడే మూడింటికి, - ఉచ్చారణ జరగడానికి కావలసిన ప్రయత్నంలో ప్రారంభ ప్రేరణ జరిగే - 1) నాభి 2) హృదయం 3) విశుద్ధి - ఈ మూడింటికి గూడా మూలకారణమైన మాతృస్థానంగా ఉండే అమ్మవారిని 'త్రిపురాంబికా' అంటారు. నాభి, హృదయం, విశుద్ధి - ఈ మూడు పురాల్లోను ఉండే - భైరవులకు అధిదేవత అయిన అమ్మవారిని ' త్రిపుర భైరవి' అంటారు. అలాగే - ఈ త్రిపురాల్లో సౌందర్యం స్థాపించబడితే ఆ సౌందర్య మూర్తె 'త్రిపుర సుందరి' అని పిలువబడుతుంది.
త్రిపురములుగా సూచింపబడు వాటికి మూలమైన తల్లివంటిది' అని ఈ నామానికి అర్ధం.
977. 🔱🙏 దశముద్రా సమారాధ్యా 🙏🔱
ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *దశముద్రా సమారాధ్యాయై నమః* అని చెప్పాలి.
దశ = పది,
ముద్రా = ముద్రలచేత,
సమ్యక్ + ఆరాధ్యా - సమారాధ్యా = చక్కగా ఆరాధింపబడునది.
‘ముదం ద్రావయతీతి - ముద్రా' అంటారు. - అనుభూతి కలిగినపుడు అప్రయత్నంగా మనలో గలిగే ఒక భంగిమను 'ముద్ర' అంటారు. ఉదా: ఒక గౌరవనీయమైన వ్యక్తిని చూడంగానే అప్రయత్నంగా మన అరచేతులు రెండూ దగ్గరౌతాయి. అదే సమస్కార 'ముద్ర' (సంపుటీ ముద్ర). లోపల ఏ ముద్ర వస్తే మనం తెలియకుండానే ఆ ముద్ర పడతామో అది అసలైన ముద్ర. అమ్మవారు బయటకు సృష్టిగా రాబోయే ముందు అయ్యవారికి ఒక 'ముద్ర' వస్తుంది అప్రయత్నంగా - అది - ‘మహాముద్ర'. .
ఇంకా ఇలా -జ్ఞానముద్ర' (దీన్నే 'ఉపదేశముద్ర' 'చిన్ముద్ర' అని కూడా అంటారు) సంపుటీ ముద్ర అంజలి ఘటిస్తున్నట్లుండే ముద్ర ఇది). విరతముద్ర (పుస్తకం తెరచినట్లుండే ముద్ర). త్రిముఖము (దీన్నే యోనిముద్ర, త్రికోణముద్ర అంటారు. (రామకృష్ణ పరమహంస శరీరం వదులు తారనంగా క్రిందటి రోజున ఈ ముద్రతో వివేకానందునికి విశ్వరూప సందర్శనం గావించాడు). పంచముఖ ముద్ర (దూరంగా వెళ్తున్న అభయ ముద్ర) అధోముఖీ ముద్ర (దీన్నే స్వాగతము ద్ర, లేదా - ప్రభాత ముద్ర అని గూడా అంటారు). సన్ముఖముద్ర (ఎడమచేత వరద, కుడిచేత అభయముద్రలు కలసి ఉంటాయి. ప్రలంబిక ముద్ర (ఒక చేతికి ఒక చెయ్యి లంబంగా అంటే పైగా ఉంచితే ఏర్పడే ముద్ర) ముష్టిక, మత్స్య, కూర్మ, వరాహ, శకట, గ్రథిత, ఉన్ముఖ, విస్తృత, ద్విముఖ, చతుర్ముఖ, చివరకు మహాక్రాంతముద్ర (రామకృష్ణ పరమహంస చెయ్యి పైకెత్తిన ముద్ర) ఇలా ఎన్నో రకాల ముద్రలున్నాయి.
అయితే, శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు ప్రత్యేకంగా పది ఉన్నాయి. సర్వ సంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండా - ఈ ముద్రలు పదింటినీ - దశముద్రలంటారు. కుడిచేతి వ్రేళ్ళను శివతత్త్వంగా, ఎడమచేతి వేళ్ళను శక్తి తత్త్వంగా
మేళనంతో - శివశక్తి సామరస్య రహస్యార్థాలను, సృష్ట్యాది కృత్యాలపరంగా - ఎన్నిటినో ఇటువంటి ముద్రల రూపంలో అభినయంచవచ్చు. అమ్మవారి సాన్నిధ్యంలో ఇటువంటి ముద్రలను ప్రదర్శిస్తూ ఆరాధిస్తే అమ్మవారికి చాలా ఇష్టమౌతుందిట. అందుచేత అమ్మవారు - దశముద్రాసమారాధ్యా!!.
శ్రీవిద్యకు సంబంధించిన ప్రధానమైన దశముద్రలచే చక్కగా ఆరాధింపబడునది - అని ఈ నామానికి అర్థం.
978.🔱🙏 త్రిపురాశ్రీవశంకరీ 🙏🔱
ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు - *త్రిపురా శ్రీవశంకర్యై నమః* అని చెప్పాలి.
శ్రీ చక్రంలోని ఐదవ చక్రాన్ని అధిష్ఠించి ఉండే ' త్రిపురాశ్రీ' అనే దేవత ప్రసన్నమయేట్లు చేయగలది కాబట్టి, అమ్మవారు - త్రిపురా శ్రీవశంకరీ.
'త్రిపురాశ్రీ' అను దేవతను ప్రసన్నురాలుగా చేయునది - అని ఈ నామానికి అర్థం .
979. 🔱🙏 జ్ఞానముద్రా 🙏🔱
నాలుగు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు - *జ్ఞానముద్రాయై నమః* అని చెప్పాలి.
జ్ఞానముద్రా = జ్ఞానము ద్రా స్వరూపిణి.
ఇంతకు పూర్వమే ముద్రలకు సంబంధించిన నామంగా 'దశముద్రా సమారాధ్యా" అని ఒక నామం చెప్పబడింది. ఆ నామంలో చెప్పబడిన ముద్రలు ప్రత్యేకంగా శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి 'జ్ఞానముద్రా' అనే నామం కూడా చెప్పబడిందంటే - అన్ని ముద్రలలోకి ప్రత్యేకమైనది, విశిష్టమైనది ఈ ముద్ర అని వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఈ జ్ఞానముద్ర' నే 'చిన్ముద్ర' అని కూడా అంటారు. దక్షిణామూర్తి యువకరూపంలో కుడి అరచేతి వ్రేళ్ళతో ఈ ముద్రను ధరించి మౌనంగా ఉంటాడు. 'ఎదురుగా వృద్ధుల రూపంలో ఉన్న శిష్యులందరికీ ఈ చిన్ముద్రను చూస్తుండగానే వారి సందేహాలన్నీ పటాపంచలై,
జ్ఞానవంతులౌతారు' అని ఈ క్రింది శ్లోకం చెబుతుంది.
*శ్లో. చిత్రం వటత రోర్మూలే శిష్యా వృద్ధాః గురోర్యువా*
*గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా*
కుడి చేతి చూపుడు వ్రేలు కొసను బొటన వ్రేలి కొసకు తగిలించి, మిగిలిన మూడు " వ్రేళ్ళను నిట్టనిలువుగా పైకి (అభయ ముద్రలోలాగా) ఉంచినప్పుడు ఏర్పడే ముద్రను * చిన్ముద్ర' అంటారు. దీన్నే 'జ్ఞానముద్ర' అని కూడా అంటారు. ఈ ముద్రను తిలకిస్తున్నపుడు సందేహాలు నివృత్తి జరిగి, సర్వజ్ఞానం ద్యోతకమౌతుంది. అంతటి ప్రాముఖ్యం గల ముద్రకాబట్టి ప్రత్యేకంగా జ్ఞాన స్వరూపిణి అయి అమ్మవారు ఈ - జ్ఞానముద్రా' స్వరూపిణిగా చెప్పబడింది. దేన్నైనా చూసినపుడు 'చాలా బాగుంది” లేదా 'చాలా బాగుంటుంద' ని చెప్పవలసి వచ్చినపుడు - నోటితో చెప్పకుండానే ఈ ముద్రను అభినయించటం గూడా మనం చూస్తూ ఉంటాం.
ఈ ముద్రలో ఒక “పూర్ణత్వం ' సూచన ఉంది. చూపుడు వ్రేలు బొటన వ్రేలు కొసలు కలిసినపుడు అవి రెండూ ఒక వృత్తాకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఆకారం 'పూర్ణత్వా నికి, పూర్ణానుస్వారానికి సంకేతం.
ఈ ముద్రలో బొటన వ్రేలు జీవుణ్ణి, చూపుడు వ్రేలు బ్రహ్మను సూచిస్తాయి కాబట్టి- ఆ రెంటి కలయిక 'జీవేశ్వర సర్వేశ్వర ఐక్యాన్ని - 'అద్వైతస్థితి' ని 'కైవల్యాన్ని' సూచిస్తుంది. కాబట్టి, దీన్ని మించిన ముద్రలేదు. అందుకే అమ్మవారికి ఈ ముద్ర అత్యంత ప్రీతి పాత్రము.
జ్ఞానము ద్రా స్వరూపిణి - అని ఈ నామానికి అర్థం.
(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)
No comments:
Post a Comment